పాఠశాలల అభివృద్ధికి ‘కనెక్ట్ స్కూల్’..ఏపీ ప్రభుత్వ వినూత్న కార్యక్రమం!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలను మార్చడమే లక్ష్యంగా ‘కనెక్ట్ స్కూల్’ (బడి కోసం) అనే ఒక అద్భుతమైన వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. తమకు విద్యాబుద్ధులు నేర్పిన పాఠశాలల పట్ల కృతజ్ఞత చాటుకోవాలనుకునే పూర్వ విద్యార్థులు, సమాజం పట్ల బాధ్యత కలిగిన దాతలు బడుల అభివృద్ధిలో భాగస్వాములు కావడానికి ఈ పథకం ఒక వారధిలా పనిచేస్తుంది. దీనికోసం విద్యాశాఖ ప్రత్యేకంగా ఒక ఆన్లైన్ పోర్టల్తో పాటు మొబైల్ యాప్ను కూడా అందుబాటులోకి తీసుకువస్తోంది.
ఈ వేదిక ద్వారా దాతలు నగదు రూపంలోనే కాకుండా, పాఠశాలలకు అవసరమైన వస్తువులను నేరుగా అందించే సౌలభ్యం కలగడం విశేషం. విద్యాశాఖ ఇప్పటికే పాఠశాలల్లో అత్యవసరంగా ఉండాల్సిన 68 రకాల వస్తువులను గుర్తించి ఒక జాబితాను రూపొందించింది. ఇందులో కంప్యూటర్లు, ఫ్యాన్లు, బెంచీలు, కుర్చీలతో పాటు స్మార్ట్ క్లాస్ పరికరాలు, క్రీడా సామాగ్రి వంటివి ఉన్నాయి. దాతలు తమకు ఇష్టమైన వస్తువులను ఆన్లైన్లో ఎంచుకుని, నిర్ణీత ధర చెల్లిస్తే చాలు.. ఆ వస్తువులు నేరుగా సంబంధిత పాఠశాల చిరునామాకు డెలివరీ చేయబడతాయి.