హైడ్రా మూడోకన్ను.. 264 చెరువుల దగ్గర 900 కెమెరాల ఏర్పాటు.. మట్టి, వ్యర్థాలు వేస్తే కేసులు తప్పవు
హైదరాబాద్ లో చెరువుల పటిష్ట భద్రతకు హైడ్రా మరిన్ని చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే కబ్జాలను అరికట్టి కొన్ని ముఖ్యమైన చెరవులకు పునరుజ్జీవం పోసిన హైడ్రా.. ఇక నుంచి చెరువులను అనునిత్యం నిఘా వ్యవస్థతో పరిరక్షించనుంది. అందులో భాగంగా ప్రతి చెరువు దగ్గర సీసీ కెమెరాలు ఏర్పాటు చేసింది. సిటీలోని 264 చెరువుల వద్ద 900 కెమేరాల ఏర్పాటు చేసి నిఘా ఏర్పాటు చేసింది హైడ్రా.
చెరువుల చుట్టూ ఏర్పాటు చేసిన సీసీకెమెరాలను హైడ్రా ఆఫీస్ లో ఉన్న సర్వర్ కు అనుసంధానం చేసింది. ఈ సందర్భంగా మే 12వ తేదీన హైడ్రా ఆఫీస్ లో సీసీటీవీ వ్యవస్థను ప్రారంభించారు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్. కంట్రోల్ రూం నుంచి 24 గంటల పర్యవేక్షణ ఉంటుందని ఈ సందర్భంగా చెప్పారు. చెరువుల్లో మట్టి పోస్తే వెంటనే అలర్ట్ అయ్యి యాక్షన్ లోకి దిగుతామని తెలిపారు.