Tamilnadu Assembly: తమిళనాడు అసెంబ్లీలో టీవీకే బలపరీక్ష.. తీర్మానం ప్రవేశపెట్టిన సీఎం విజయ్
చెన్నై: తమిళనాడు అసెంబ్లీ(Tamilnadu Assembly)లో సీఎం విజయ్ బలపరీక్ష ఎదుర్కొంటున్నారు. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో పూర్తి స్థాయి మెజారిటీ రాకపోవడంతో.. గవర్నర్ అర్లేకర్ ఆదేశాల ప్రకారం ఇవాళ ఆయన పార్టీ బలపరీక్షకు సిద్దమైంది. విశ్వాస పరీక్షకు చెందిన తీర్మానాన్ని ఇవాళ అసెంబ్లీలో సీఎం విజయ్ ప్రవేశపెట్టారు. తమిళిగ వెట్రి కజగం పార్టీకి ఆయన మద్దతు కోరారు. విశ్వాసపరీక్ష ప్రక్రియలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ తన మద్దతును టీవీకే పార్టీకి ప్రకటించింది. సీపీఎం పార్టీ కూడా విజయ్కే మద్దతు తెలిపింది. విశ్వాస పరీక్ష సమయంలో వీసీకే కూడా తన సపోర్టు టీవీకేకే అని వెల్లడించింది. అధికారంలో ఉన్న టీవీకేకే తమ మద్దతు ఉంటుందని ఐయూఎంఎల్ కూడా చెప్పింది.
అయితే టీవీకే పార్టీకి వీసీకే ఓ విన్నపం చేసింది. మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా ఓ చట్టాన్ని తేవాలని ఆ పార్టీ కోరింది. మహారాష్ట్ర, కర్నాటక తరహాలో ఆ చట్టం ఉండాలని ఆ పార్టీ కోరింది. అన్నాడీఎంకేకు చెందిన పళనిస్వామి వర్గం .. టీవీకేకు వ్యతిరేకంగా ఉన్నది. కానీ షణ్ముగం వర్గం మాత్రం విజయ్కే మద్దతు పలికింది. ఓఎస్డీగా రాధన్ పండిట్ను నియమించడాన్ని దేశీయ మురుపొక్కు ద్రావిడ కజగం పార్టీ వ్యతిరేకించింది. విశ్వాస పరీక్ష సమయంలో ఎమ్మెల్యే ప్రేమలతా విజయ్కాంత్ మాట్లాడారు. ప్రఖ్యాత జ్యోతిష్కుడు రికీ పండిట్ వెట్రివేల్ను రాధన్ పండిట్గా పిలుస్తారు. అయితే సీఎం విజయ్ ఓఎస్డీగా రాధన్ను నియమించడాన్ని ప్రేమలత తప్పుపట్టారు. మీరు ఎటువంటి సందేశాన్ని ఇస్తున్నారని ఆమె ప్రశ్నించారు. విశ్వాస పరీక్షకు వ్యతిరేకంగా ఉన్నట్లు ఎంజేకే పార్టీ తెలిపింది. ప్రభుత్వంలో ఓ జ్యోతిష్కుడు ఉండరాదని ఆ పార్టీ అభిప్రాయపడింది.