ఏపీ, తెలంగాణలో SIRపై ఈసీ కీలక ప్రకటన
మూడో దశ SIR (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్)పై భారత ఎన్నికల సంఘం ప్రకటన చేసింది. ఈ దశలో తెలంగాణ, ఏపీ సహా 16 రాష్ట్రాలు, మూడు కేంద్రపాలిత ప్రాంతాల్లో ఓటర్ల జాబితాను సవరించనుంది. తెలంగాణలో జూన్ 25 నుంచి జులై 24 వరకు, ఏపీలో జూన్ 15 నుంచి జులై 14 వరకు బీఎల్వో, బీఎల్ఏలు డోర్ టు డోర్ సందర్శించి వివరాలు సేకరిస్తారు. తెలంగాణలో జులై 31, ఏపీలో జులై 21న ఓటర్ల ముసాయిదా జాబితాను ప్రకటిస్తారు. దేశంలోని 16 రాష్ట్రాలు, 3 కేంద్రపాలిత ప్రాంతాలలో 'స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్' (SIR) చేపట్టనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం గురువారం ప్రకటించింది.
జాతీయ జనాభా గణన (Census) పనులతో సమన్వయం చేసుకుంటూ, క్షేత్రస్థాయి యంత్రాంగాన్ని సమర్థవంతంగా వినియోగించుకోవాలనే ఉద్దేశంతో ఈ షెడ్యూల్ను రూపొందించారు. ఈ దశలో సుమారు 3.94 లక్షల మంది బూత్ లెవల్ ఆఫీసర్లు (BLOs) ఇంటింటికీ వెళ్లి దాదాపు 36.73 కోట్ల మంది ఓటర్ల వివరాలను ధృవీకరించనున్నారు. ఢిల్లీలో కూడా ఈ ప్రక్రియ జరగనుండగా, అక్టోబర్ 7న తుది ఓటర్ల జాబితాను ప్రచురించనున్నారు.