Manish Pandey: వర్షం వచ్చినా, ఎండ ఉన్నా ఆగం.. కేకేఆర్ హీరో మనీష్ పాండే ఆసక్తికర వ్యాఖ్యలు!
ఐపీఎల్ 2026లో భాగంగా బుధవారం ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ 4 వికెట్ల తేడాతో గెలిచింది. ముందుగా ముంబై 8 వికెట్లకు 147 పరుగులే చేయగా.. కోల్కతా 18.5 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్షాన్ని ఛేదించింది. కేకేఆర్ విజయంలో కీలక పాత్ర పోషించిన మనీష్ పాండే (45; 33 బంతుల్లో 6×4)కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. మ్యాచ్ అనంతరం మాట్లాడిన మనీష్.. కేకేఆర్తో తన అనుబంధం, జట్టులో అవకాశాలు రాకపోయినా మోటివేషన్ కోల్పోకుండా ఎలా ముందుకు సాగాడో భావోద్వేగంగా వివరించాడు. 2014లో కేకేఆర్ టైటిల్ గెలిచిన జట్టులో భాగమైన మనీష్.. 2024 తర్వాత మళ్లీ జట్టులో కీలక పాత్ర పోషించడం ప్రత్యేకంగా నిలిచింది. 2014, 2024లో కోల్కతాకు చాలా చేశారు అనే ప్రశ్నకు మనీష్ పాండే మాట్లాడుతూ…
‘బహుశా అందుకే నేను ఇంకా ఇక్కడ ఉన్నానేమో. కేకేఆర్ ఎప్పుడూ నాకు ఎంతో చేసింది. ఈ సీజన్ ప్రారంభం నుంచి చూస్తే.. నేను బ్యాటింగ్ చేసిన మ్యాచ్ ఇదే. మొదటి నాలుగు మ్యాచ్ల్లో కూడా ప్యాడ్స్ కట్టుకుని రెడీగా ఉన్నా కానీ.. అవకాశం రాలేదు. కానీ ఈ మ్యాచ్ మాత్రం నాకు ఎంతో ప్రత్యేకం. క్రీజులో ఎక్కువసేపు ఉండి జట్టును గెలిపించాలనుకున్నా. అదృష్టవశాత్తూ అదే జరిగింది. మధ్యలో రోవ్మన్ పావెల్తో కలిసి నిర్మించిన భాగస్వామ్యం జట్టుకు ఎంతో ఉపయోగపడింది. కొన్ని మంచి పార్ట్నర్షిప్స్ వచ్చాయి. అదే మా విజయానికి కారణమైంది. మిగిలిన మ్యాచ్లో కూడా ఇదే విధంగా ఆడి జట్టును టాప్-4లోకి తీసుకెళ్లాలని ఆశిస్తున్నా’ అని అన్నాడు.