‘ఎల్ నినో’ సన్నద్ధతపై సర్కార్ నిర్లక్ష్యం
ఎల్నినో సన్నద్ధతపై కాంగ్రెస్ సర్కార్ తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నదని మాజీ ఎంపీ, బీఆర్ఎస్ నేత బోయినపల్లి వినోద్కుమార్ ఆరోపించారు.
హైదరాబాద్, జూలై 3 (నమస్తే తెలంగాణ) : ఎల్నినో సన్నద్ధతపై కాంగ్రెస్ సర్కార్ తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నదని మాజీ ఎంపీ, బీఆర్ఎస్ నేత బోయినపల్లి వినోద్కుమార్ ఆరోపించారు. ఈ మేరకు పార్టీ సీనియర్ నాయకులు వాసుదేవరెడ్డి, గట్టు రామచంద్రరావు, సత్యనారాయణ, కల్యాణ్రావులతో కలిసి శుక్రవారం తెలంగాణ భవన్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వినోద్కుమార్ మాట్లాడుతూ.. కేంద్రం ఎల్ నినో ప్రభావంపై జారీ చేసిన మార్గదర్శకాల్లో.. రిజర్వాయర్లలోని నీటిని పొదుపుగా వాడుకోవాలని రాష్ర్టాలకు సూచించినట్టు తెలిపారు. ఆ జాబితాలో తెలంగాణ కూడా ఉన్నట్టు చెప్పారు. వర్షాలు తగ్గడంతో వచ్చే వేసవిలో నీటి ఎద్దడి తీవ్రంగా ఉంటుందని హెచ్చరించారు. ఎల్నినో విపత్కర పరిస్థితి సృష్టించబోతున్నదని, అయినా రాష్ట్ర ప్రభుత్వానికి పట్టింపు లేదని మండిపడ్డారు. మంత్రులు ఎల్ నినోపై దృష్టి పెట్టకుండా సవాళ్ల పేరిట డ్రామాలు ఆడుతున్నారని ధ్వజమెత్తారు. లక్ష్మీ బరాజ్ వద్ద శుక్రవారం 15 వేల క్యూసెక్కుల నీరు ప్రవహించిందని, కాగజ్నగర్ వద్ద 45 వేల క్యూసెక్కులు ప్రాణహితలోకి వెళ్తున్నదని చెప్పారు. సీఎం రేవంత్రెడ్డి అనాలోచిత చర్యలతో ఆ నీరంతా వృథాగా సముద్రంలోకి వెళ్తున్నదని ఆవేదన వ్యక్తంచేశారు.
ఇప్పటికైనా పంపులు ఆన్చేయాలి.. మంత్రులు సవాళ్లతో కాలం వృథా చేయకుండా వెంటనే మేడిగడ్డ పంపులు ఆన్ చేసేలా చర్యలు చేపట్టాలని వినోద్కుమార్ కోరారు. ప్రాణహిత దగ్గర నీళ్లు ఉన్నా వాడుకోని అసమర్థుడిగా రేవంత్రెడ్డి మిగిలిపోయారని మండిపడ్డారు. బండి సంజయ్ తమ్మిడిహట్టికి రెండు నెలల్లో అనుమతి తెస్తా అని చెప్పారని, అది ఏమైంది? అని ప్రశ్నించారు. మహారాష్ట్ర సీఎం అపాయింట్మెంట్ ఇవ్వడం లేదని హడావుడి చేసిన రేవంత్రెడ్డి, ఇప్పుడు ఆ అంశంపై ఎందుకు మాట్లాడటం లేదని నిలదీశారు. 152 మీటర్ల ఎత్తున తమ్మిడిహట్టి సాధ్యం కాదని స్పష్టంచేశారు. నీళ్లు పంప్ చేస్తేనే ఎల్ నినోను సమర్థంగా ఎదుర్కోగలమనే విషయాన్ని ఇప్పటికైనా రేవంత్రెడ్డి గ్రహించాలని వినోద్కుమార్ సూచించారు.
కేసీఆర్ను బద్నాం చేయాలనే.. మేడిగడ్డ పిల్లర్లు రిపేర్ చేయకుండా సీఎం రేవంత్రెడ్డి మొద్దునిద్ర వీడటం లేదని వినోద్కుమార్ ఆగ్రహం వ్యక్తంచేశారు. మేడిగడ్డ దగ్గర కానాయపల్లి వద్ద మోటర్లు ఆన్చేస్తే ఎల్ఎండీ సగం నిండేదని స్పష్టంచేశారు. చిన్న రబ్బర్ డ్యామ్ కట్టినా, ఇసుక మేట వేసినా కన్నెపల్లి పంపులు ఆన్ చేయవచ్చని సూచించారు. మేడిగడ్డ రిపేర్లు చేస్తే ఎన్డీఎస్ఏ వద్దన్నదా? అని ప్రశ్నించారు. కేసీఆర్ను బద్నాం చేయాలనే మేడిగడ్డకు మరమ్మతులు చేయకుండా రేవంత్రెడ్డి దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని నిప్పులు చెరిగారు. ఎల్ నినోతోనైనా రేవంత్రెడ్డి మేల్కోవాలని సూచించారు. వెంటనే మేడిగడ్డ దగ్గర తాత్కాలిక అడ్డుకట్ట వేసి మోటర్లు ఆన్ చేయాలని వినోద్ కుమార్ డిమాండ్ చేశారు.