మనకూ కష్టాలు తప్పవా?
ఇరాన్పై యుద్ధమేఘాలు పరచుకోవడం తప్పకపోవచ్చన్న భయాందోళనలు నిజమయ్యాయి. అమెరికా, ఇజ్రాయెల్లు సంయుక్తంగా టెహ్రాన్పై విరుచుకుపడి, సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీని అంతమొందించాయి. ఇరాన్ సైతం భారీస్థాయిలో ప్రతిదాడులకు దిగింది. దాంతో పశ్చిమాసియా అట్టుడికిపోతోంది. ప్రపంచంపైనా, ముఖ్యంగా భారత్పైనా యుద్ధ ప్రభావం ఎలా ఉండనుంది?
ఇరాన్ అణు, క్షిపణి కార్యక్రమాలను ముమ్మరంగా చేపడుతోందనీ, ఆ దేశం నుంచి ఎదురవుతున్న బెదిరింపులకు అడ్డుకట్ట వేయడానికే దాడులకు దిగాల్సి వచ్చిందని అమెరికా చెబుతోంది. కానీ, ఈ దాడుల వెనక- ఇరాన్ చమురును చేజిక్కించుకోవడానికి ఉన్న అడ్డంకులను తొలగించుకోవాలన్న ఆలోచన వాషింగ్టన్కు ఉండి ఉండొచ్చు. మరోవైపు ప్రాంతీయంగా తనకు సింహస్వప్నంగా, శక్తిమంతమైన శత్రువుగా మారిన ఇరాన్ను బలహీనపరచడం ఇజ్రాయెల్కు చాలా అవసరం. కాబట్టి, సుప్రీం లీడర్ను అంతమొందించడం ద్వారా ఇరాన్ నాయకత్వాన్ని బలహీనపరచి, తిరుగుబాటుదారుల నేతృత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చని ఆ రెండు దేశాలూ భావించి ఉండవచ్చు. కానీ, ఇరాన్ పరిస్థితులు వెనెజువెలా మాదిరిగా లేవని ఇక్కడ గమనించాలి. ఎందుకంటే, టెహ్రాన్ రాజకీయ నిర్మాణం శక్తిమంతమైన వ్యవస్థలపై ఆధారపడి ఉంది. ముఖ్యంగా మతాధికారుల సంస్థ, ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కోర్, ప్రజల్లో బలంగా వేళ్లూనుకున్న జాతీయవాద భావనలు అక్కడి రాజకీయాలను శాసిస్తాయి. కాబట్టి, బయటి నుంచి వచ్చే ఒత్తిళ్లతో అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమనేది అంత సులభమేమీ కాదు. పైగా తమ శత్రుదేశాల చేతిలో చనిపోయిన ఖమేనీని ఎక్కువమంది ఇరానీయులు అమరవీరుడిగా శ్లాఘించడమే కాకుండా, జాతీయవాద భావనలను ఇంకా పెంచుకోవచ్చు. సుసంపన్నమైన వనరులు కలిగి ఉండి, ఒక బలమైన జాతిగా గుర్తింపు పొందిన రాజ్యంపై ఇతర దేశాలు పెత్తనం చేస్తే- అది ఎడతెగని ప్రతిఘటనలకే దారితీస్తుంది. కాబట్టి, రాబోయే నెలల్లో అగ్రరాజ్యానికి టెహ్రాన్ నుంచి సైనికపరంగా, రాజకీయంగా, వ్యూహాత్మకంగా చికాకులు తప్పకపోవచ్చు.