Priyanka Chopra: 'మౌనంగా ఉండలేకపోతున్నాను' ఇరాన్ యుద్ధంపై ప్రియాంకా చోప్రా ఎమోషనల్ పోస్ట్!
బాంబుల మోతతో మిడిల్ ఈస్ట్ మార్మోగుతోంది. ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా దాడులకు దిగడంతో యుద్ధ వాతావరణం తీవ్రరూపం దాల్చింది. యూఎస్ ఎంబసీలే టార్గెట్ గా ఇరాన్ ప్రతి దాడులకు దిగింది. ఈ యుద్ధ పరిణామాలతో గల్ఫ్ దేశాల ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. ముఖ్యంగా మిడిల్ ఈస్ట్ దేశాలలో విమాన సర్వీసులు నిలిచిపోవడంతో వేలాది మంది ప్రయాణికులు ఎయిర్పోర్టుల్లో చిక్కుకుపోయారు. ఈ గందరగోళ పరిస్థితుల నడుమ, గ్లోబల్ స్టార్ ప్రియాంకా చోప్రా సామాజిక మాధ్యమాల వేదికగా శాంతి సందేశాన్ని పంచుకున్నారు. హోలీ పండుగను పురస్కరించుకుని ఆమె చేసిన పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.
హోలికా దహన్ మంటల చుట్టూ ప్రజలు ఉన్న ఫోటోను షేర్ చేస్తూ.. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలపై ప్రియాంక చోప్రా ఆందోళన వ్యక్తం చేశారు. ప్రపంచంలో ఎన్నో దారుణాలు జరుగుతున్నాయి. ఇది చాలా కఠినమైన సమయం, మనసు భారంగా అనిపిస్తోంది. కానీ, చీకటిని చీల్చుకుని వెలుగు దారి చూపుతుందని నేను నమ్ముతున్నాను. చెడుపై మంచి సాధించే విజయానికి ఇది సంకేతం అంటూ ఆమె రాసుకొచ్చారు. యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ, ప్రియాంక పంచుకున్న ఈ ఆశావాద సందేశం అభిమానుల మనసు గెలుచుకుంటోంది.
యుద్ధం కారణంగా గల్ఫ్ దేశాల్లో గగనతలం మూసివేయడంతో విమాన రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. దీంతో మన టాలీవుడ్, బాలీవుడ్ ప్రముఖులు కూడా దుబాయ్లో చిక్కుకుపోయారు. మంచు విష్ణు, ఈషా గుప్తా, నర్గిస్ ఫక్రీ, సోనాల్ చౌహాన్ వంటి నటీనటులు ప్రస్తుతం దుబాయ్లోనే ఉండిపోయారు. ప్రముఖ బ్యాడ్మింటన్ స్టార్ పి.వి. సింధు కూడా దుబాయ్ విమానాశ్రయంలో చిక్కుకుపోయారు. ఆమె బస చేసిన హోటల్ సమీపంలోనే భారీ పేలుడు శబ్దం వినిపించిందని, పరిస్థితి చాలా భయంకరంగా ఉందని ఆమె సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు.