ఎట్టకేలకు భారత్కు చేరుకున్న పీవీ సింధు
ఇంటర్నెట్ డెస్క్: పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో దుబాయ్లో చిక్కుకుపోయిన భారత స్టార్ షట్లర్ పీవీ సింధు (PV Sindhu) ఎట్టకేలకు భారత్ చేరుకున్నారు. మంగళవారం ఆమె బెంగళూరు ఎయిర్పోర్టులో దిగారు. ఈ విషయాన్ని సింధు ‘ఎక్స్’లో వెల్లడించారు. (PV Sindhu returns to India)
‘‘సురక్షితంగా బెంగళూరుకు చేరుకున్నా. గడిచిన కొన్ని రోజులు అత్యంత అనిశ్చిత పరిస్థితులు ఎదుర్కొన్నా. ఎట్టకేలకు ఇంటికి చేరుకోగలిగా. ఈ క్లిష్ట సమయంలో మమ్మల్ని సురక్షితంగా చూసుకోవడం కోసం దుబాయ్ అధికారులు, ఎయిర్పోర్టు సిబ్బంది, ఇమిగ్రేషన్ అధికారులు అందించిన సేవలను మాటల్లో చెప్పలేను. వారందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ప్రస్తుతం విశ్రాంతి తీసుకోవాలనుకుంటున్నా. రీసెట్ అయ్యాక నా భవిష్యత్తు ప్రణాళికల గురించి ఆలోచిస్తా’’ అని సింధు తన పోస్ట్లో రాసుకొచ్చారు.
ఆల్ ఇంగ్లాండ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ కోసం గతవారం ఇంగ్లాండ్ బయల్దేరిన సింధు.. అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ ఘర్షణల కారణంగా దుబాయ్ విమానాశ్రయంలో చిక్కుకుపోయిన సంగతి తెలిసిందే. ఉద్రిక్తతల నేపథ్యంలో గత శనివారం నుంచి విమాన సర్వీసులు రద్దు కావడంతో ఆమె ప్రయాణం ఆగిపోయింది. అప్పటినుంచి దుబాయ్లోనే సురక్షిత ప్రాంతంలో ఉండాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే యూఏఈ, భారత్ అధికారుల సమన్వయంతో అక్కడ చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చే ఏర్పాట్లు చేశారు. దీంతో సింధు బెంగళూరుకు చేరుకున్నారు.
ఇదిలాఉండగా.. ఆల్ ఇంగ్లాండ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ మంగళవారం ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో సింధు పాల్గొనడంపై అనిశ్చితి నెలకొంది. ప్రస్తుత పరిణామాల్ని నిశితంగా గమనిస్తోన్న ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ).. ప్రయాణ ఆటంకాల కారణంగా క్రీడాకారులు ఆలస్యంగా వస్తే షెడ్యూల్లో మార్పులు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, దీనిపై అధికారిక ప్రకటనేదీ రాలేదు.