Fuel Shortage in Telangana: తెలంగాణలో పెట్రోల్, LPG కొరత లేదు.. ప్రజలు ఆందోళన చెందవద్దు: పౌరసరఫరాల శాఖ
తెలంగాణలో పెట్రోల్, డీజిల్, LPGగ్యాస్ కొరత లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రజలు వదంతులు నమ్మవద్దని, ఇంధన నిల్వలు పుష్కలంగా ఉన్నాయని అధికారులు ప్రకటించారు.
హైదరాబాద్: తెలంగాణలో గత కొన్ని రోజుల నుంచి పలు పెట్రోల్, ఎల్పీజీ బంకులలో నో స్టాక్ బోర్డులు కనిపిస్తుండగా.. కొన్నిచోట్ల కిలోమీటర్ల మేర క్యూ లైన్లు ఉంటున్నాయి. రాష్ట్రంలో ఇంధన కొరత ఉందని మంగళవారం నాడు హైదరాబాద్లో పలు పెట్రోల్ బంకుల వద్ద పరిస్థితి చూపించేలా వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కాగా, దీనిపై తెలంగాణ పౌరసరఫరాల శాఖ స్పందించి. రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ వంట గ్యాస్ నిల్వలకు ఎలాంటి కొరత లేదని పౌరసరఫరాల శాఖ స్పష్టం చేసింది.
గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వస్తున్న తప్పుడు ప్రచారాల వల్ల ప్రజలు భయాందోళనలకు గురై పెట్రోల్ బంకుల వద్ద క్యూ కడుతున్నారని, దీనివల్ల అనవసర రద్దీ ఏర్పడుతోందని అధికారులు చెబుతున్నారు. రిఫైనరీల నుండి ఇంధన సరఫరా సక్రమంగా జరుగుతోందని, ప్రజల అవసరాలకు సరిపడా నిల్వలు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. అయితే సోషల్ మీడియాలో వచ్చే వదంతులను నమ్మి అకస్మాత్తుగా పెట్రోల్ బంకులకు వెళ్లి కొనుగోళ్లు చేయవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
తెలంగాణ పెట్రోలియం డీలర్ల అసోసియేషన్ కూడా ఈ విషయంపై స్పందించింది. రాష్ట్రంలో ఎక్కడా ఇంధన కొరత లేదని తేల్చి చెప్పింది. హెచ్పీసీఎల్ (HPCL), ఐవోసీఎల్, బీపీసీఎల్ (BPCL) వంటి సంస్థల వద్ద తగినంత స్టాక్ ఉందని తెలిపింది. కస్టమర్ల ముందస్తు కొనుగోళ్ల వల్లే క్షేత్రస్థాయిలో ఇబ్బందులు తలెత్తుతున్నాయని, ఇంధన కొరత లేదని పేర్కొంది. సరఫరాలో ఎలాంటి అంతరాయం లేదని, ప్రజలు సంయమనం పాటించాలని.. అవసరానికి తగ్గట్లుగా ఫ్యూయల్ ఫిల్ చేసుకోవాలని అసోసియేషన్ కోరింది.
హైదరాబాద్లోని కూకట్పల్లి, అమీర్పేట, ఖైరతాబాద్ వంటి ప్రధాన ప్రాంతాల్లో పెట్రోల్ బంకుల వద్ద వాహనాలు కిలోమీటర్ల మేర బారులు తీరాయి. అకస్మాత్తుగా పెరిగిన డిమాండ్తో పలు చోట్ల 'నో స్టాక్' బోర్డులు దర్శనమివ్వడం వాహనదారుల్లో ఆందోళన నింపింది. మరోవైపు, లక్డీకాపూల్ వంటి ప్రాంతాల్లో ఎల్పీజీ గ్యాస్ కోసం వందలాది ఆటోలు గంటల తరబడి వేచి చూడటంతో ట్రాఫిక్ స్తంభించిపోయింది. ఈ ఇంధన కొరత వదంతుల వల్ల సామాన్యుల జనజీవనం, ఆటో కార్మికుల ఉపాధి తీవ్రంగా దెబ్బతిన్నాయి.