Unit 8200 Israel: మొస్సాద్ను మించిన దళం.. ఇరాన్ సామ్రాజ్యాన్ని కుప్పకూల్చిన ఇజ్రాయెల్ అదృశ్య సైన్యం!
Unit 8200 Israel: అమెరికా, ఇజ్రాయెల్ – ఇరాన్ మధ్య జరుగుతున్న భయంకరమైన యుద్ధం ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే ఈ యుద్ధం కారణంగా ఏదో రకంగా ప్రపంచంలో దాదాపు అన్ని దేశాలు ప్రత్యేక్షంగా, పరోక్షంగా ఎఫెక్ట్ అవుతున్నవే.. ప్రస్తుతం ఈ యుద్ధం గురించి ఎలాంటి వార్తలు వచ్చిన అవి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అలాంటి ఒక వైరల్ వార్త ఇప్పుడు ప్రపంచం దృష్టిని విశేషంగా ఆకర్షిస్తుంది. అదే.. ఇజ్రాయెల్ యొక్క యూనిట్ 8200 . అసలు ఈ యూనిట్ ప్రత్యేకత ఏంటి, అది ఎందుకని ఇంత వైరల్ అవుతుందో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
ఇరాన్ ప్రముఖ నాయకులను లక్ష్యంగా చేసుకుని హత్యలు చేయడానికి ఇజ్రాయెల్ ఈ యూనిట్ను ఉపయోగిస్తోందని చెబుతున్నారు. ఇరాన్ అగ్రనాయకుడు అయతోల్లా అలీ ఖమేనీ, ఐఆర్జిసి అధిపతి మహమ్మద్ పక్పూర్ వంటి అగ్ర నాయకుల హత్యలలో ఈ యూనిట్ 8200 పాత్ర పోషించిందని అమెరికన్ వార్తాపత్రిక వాషింగ్టన్ పోస్ట్ పేర్కొంది. గతంలో ఈ యూనిట్ హిజ్బుల్లా అగ్రనాయకులను సైతం హత్య చేసిందని చెబుతున్నారు. నిజానికి ఈ ఇజ్రాయెల్ యూనిట్ను మెస్సాద్ కంటే అత్యంత ప్రమాదకరమైన దళంగా అభివర్ణిస్తారు. ఈ ఇజ్రాయెల్ యూనిట్ సైబర్ సెక్యూరిటీ, కెమెరాలు, సోషల్ మీడియా ద్వారా ఇరాన్ అంతటా తీవ్ర విధ్వంసం సృష్టించిందని, ఈ యూనిట్ జరిపిన ఆపరేషన్ల ఫలితంగా కనీసం 40 మంది ఇరాన్ ప్రముఖ నాయకులు హత్యకు గురయ్యారని సమాచారం. ఈ యూనిట్ మొస్సాద్కు భిన్నమైనదని, ఇజ్రాయెల్ రక్షణ దళాలలో ఒక ప్రత్యేక గూఢచార విభాగంగా ఇది పని చేస్తుందన్నారు.
ఇజ్రాయెల్లో యూనిట్ 8200ను “ష్మోనే మటైమ్” అని పిలుస్తారు. 1948లో స్థాపించిన ఈ యూనిట్ ఇజ్రాయెల్ రక్షణ దళాల వ్యక్తిగత గూఢచార సంస్థ. సైన్యానికి గూఢచార, సైబర్ సంబంధిత సమాచారాన్ని అందించడం, తద్వారా వారు తమ కార్యకలాపాలను మరింత సమర్థవంతంగా నిర్వహించగలిగేలా చేయడం ఈ యూనిట్ ప్రధాన లక్ష్యం. రాయిటర్స్ వార్తా సంస్థ ప్రకారం.. ఈ సంస్థ అమెరికా జాతీయ భద్రతా సంస్థ లేదా బ్రిటన్ GCHQకి సమానమైనది. ఇది ఇజ్రాయెల్ సైనిక దళంలో అతిపెద్ద విభాగం అని కూడా చెబుతారు. యూనిట్ 8200 రహస్య కార్యకలాపాలను నిర్వహిస్తుందని, ఇది సిగ్నల్స్ ఇంటెలిజెన్స్ నుంచి డేటా మైనింగ్, సాంకేతిక దాడుల వరకు అన్నింటిలోనూ ప్రత్యేకత స్థానాన్ని సంపాదించుకుందని రక్షణ వర్గాలు చెబుతున్నాయి. ఒక కెమెరాను హ్యాక్ చేయడం ద్వారా ఇరాన్లో అలీ ఖమేనీ ఉన్న ప్రదేశాన్ని ఈ యూనిట్ గుర్తించినట్లు సమాచారం.