నాడు లక్షమందిని విమానాల్లో తీసుకొచ్చి.. గల్ఫ్ నుంచి భారత్ ‘ఎయిర్లిఫ్ట్’
ఇంటర్నెట్డెస్క్: ఇజ్రాయెల్-అమెరికా, ఇరాన్ యుద్ధంతో గల్ఫ్లో మరోసారి సంక్షోభ పరిస్థితులు కనిపిస్తున్నాయి (US-Israel-Iran war). లక్షలమంది భారతీయులు గల్ఫ్లో ఉపాధి పొందుతుండటం.. ఈ ప్రాంతం భారత్ ఇంధన అవసరాలు తీరుస్తుండటంతో తాజా ఘర్షణలు ఆందోళన రేకెత్తిస్తున్నాయి. అదే సమయంలో 1990ల నాటి ‘ఎయిర్లిఫ్ట్’ను గుర్తుచేస్తున్నాయి. దానిపై ఓ చిత్రం కూడా వచ్చింది. అసలు అప్పుడు ఏం జరిగిందో తెలుసా..?
1990ల్లో గల్ఫ్ ప్రాంతం ఎదుర్కొన్న సంక్షోభాన్ని గల్ఫ్వార్ (1990-1991)గా చెప్తారు. 1990 ఆగస్టు 2న కువైట్ (Kuwait)పై సద్దాం హుస్సేన్ నేతృత్వంలోని ఇరాక్ సేనలు దండయాత్ర చేయడంతో ఈ యుద్ధం ప్రారంభమైంది. అప్పటికే ఎనిమిదేళ్లుగా ఇరాన్తో యుద్ధం (Iran-Iraq War)లో మునిగిపోయిన ఇరాక్ అప్పుల ఊబిలో కూరుకుపోయింది. దాంతో తన రుణాలను రద్దు చేయాలంటూ కువైట్పై దురాక్రమణ చేసి, ఒత్తిడి తీసుకువచ్చింది. ఆ దేశం అతిగా చమురు తవ్వకాలను చేపట్టడం వల్లే అంతర్జాతీయ మార్కెట్లో ధరలు తగ్గి.. తమ ఆర్థిక వ్యవస్థ నష్టపోయిందని సద్దాం ప్రభుత్వం ఆరోపించింది. చారిత్రక పరంగా చూసుకున్నా కువైట్ ఇరాక్లో భాగమని ఆక్రమణను సమర్థించుకుంది. ఈ సంక్షోభం భారతీయులపై తీవ్ర ప్రభావం చూపింది. ఆ ప్రాంతంలో 1,70,000 మంది చిక్కుకుపోయారు. దాంతో భారత ప్రభుత్వం భారీ రెస్క్యూ ఆపరేషన్ చేపట్టింది.
మొత్తం 59 రోజుల పాటు ఎయిరిండియా 488 విమాన సర్వీసుల్ని నడిపింది. అత్యంత దయనీయమైన పరిస్థితుల్లో వ్యయప్రయాసలకోర్చి జోర్డాన్ సరిహద్దులకు చేరుకున్న వారిని.. స్వదేశానికి తీసుకువచ్చారు. ఇది భారత చరిత్రలో అతిపెద్ద పౌర తరలింపుగా నిలిచింది. ఇక్కడవరకు బాగానే ఉన్నా.. ఈ గల్ఫ్ వార్ (Gulf War) భారత ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావాన్నే చూపించింది. పెద్దా చిన్నా అని తేడాలేకుండా వేలాదిమంది ఉపాధి కోల్పోయారు. వ్యాపారాలు మూతపడ్డాయి. దాచుకొన్న సొమ్ము అడుగంటింది. చమురు దిగుమతులు భారంగా మారాయి. దాంతో నాడు భారత్ ఎదుర్కొన్న చెల్లింపుల సంక్షోభానికి ఈ గల్ఫ్ వార్ మరింత ఆజ్యంపోసింది.