US Iran War: అమెరికా, ఇరాన్ మధ్య మహా ఒప్పందం ఖరారు! డొనాల్డ్ ట్రంప్ సంతకంపై ఉత్కంఠ
వాషింగ్టన్: పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితుల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. శాంతి ఒప్పందంపై కొనసాగుతున్న చర్చల మధ్య అమెరికా, ఇరాన్లు 60 రోజుల పాటు కాల్పుల విరమణను పొడిగించే ఒప్పందానికి అంగీకరించాయి. అయితే, ఈ అవగాహన ఒప్పందానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆమోదం తెలపాల్సి ఉంటుంది. ట్రంప్ ఓకే చేస్తే.. మరో 2 నెలలపాటు సీజ్ ఫైర్ కొనసాగుతుందని, పరిస్థితుల్లో కొంత మార్పు ఉంటుందని పలు దేశాలు భావిస్తున్నాయి.
న్యూస్ ఏజెన్సీ AFP వర్గాల సమాచారం ప్రకారం.. అమెరికా- ఇరాన్ కాల్పుల విరమణను పొడిగించడంతో పాటు ఇరాన్ అణు కార్యక్రమంపై చర్చలు ప్రారంభించడానికి అంగీకరించాయి. AXIOS నివేదిక ప్రకారం, ఇరాన్లో కూడా ఈ ఒప్పందం ముసాయిదాపై చర్చలు మొదలయ్యాయి. అమెరికా, ఇరాన్ అధినేతలు ఈ ఒప్పందంపై సంతకాలు చేయాల్సి ఉంటుంది.
అమెరికా, ఇరాన్ మధ్య ప్రతిపాదిత ఈ అవగాహన ఒప్పందం గురించి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నకు తెలియజేశామని, అయితే ఆయన ఇంకా దీనిపై సంతకం చేయలేదని అమెరికా అధికారి ఒకరు తెలిపారు. ఈ తాజా ఒప్పందంపై సంతకం చేయాలా.. వద్దా అని ఆలోచించుకోవడానికి తనకు కొన్ని రోజులు కావాలని ట్రంప్ ట్విస్ట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. హర్మూజ్ జలసంధిలో ఇరాన్ టోల్ వసూలు చేయలేదు హర్మూజ్ జలసంధిలో టోల్ వసూలు తాత్కాలికంగా నిలిపివేస్తారన్న వార్త పలు దేశాలకు ఊరట కలిగిస్తోంది. ఈ 60 రోజుల కాల్పుల విరమణ ఒప్పందంలో హర్మూజ్ జలసంధి ద్వారా నౌకల రాకపోకలు సజావుగా జరగాలని పేర్కొన్నారు. అంటే, ఈ ఒప్పందం కుదిరితే, ఈ కీలకమైన జలమార్గం ద్వారా వెళ్లే నౌకలపై ఇరాన్ టోల్ వసూలు చేసే అవకాశం ఉండదు. హర్మూజ్ జలసంధిపై ఎవరూ హక్కులు పొందలేరని లేదా బెదిరించలేరని ఒక అమెరికా అధికారి తెలిపారు. దీంతో పాటు, ఇరాన్ 30 రోజుల్లోపు ఈ జలమార్గంలో పేల్చివేయడానికి ఫిక్స్ చేసిన అన్ని మైన్లను తొలగించాలి.