ఆధునిక పద్ధతులతో పాల ఉత్పత్తులను పెంచాలి..పాడి రైతులకు అదనపు ఆదాయం కల్పించాలి: డిప్యూటీ సీఎం భట్టి
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో పాడి పరిశ్రమను లాభసాటిగా మార్చేందుకు, పాల ఉత్పత్తులను గణనీయంగా పెంచేందుకు ఆధునిక పద్ధతులను అనుసరించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారులకు సూచించారు. రైతులకు వ్యవసాయం ద్వారానే కాకుండా, పాడి పరిశ్రమ ద్వారా కూడా అదనపు ఆదాయం కల్పించేందుకు అవసరమైన అన్ని రకాల చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గవర్నమెంట్స్కూళ్లు, అంగన్వాడీ కేంద్రాలకు విజయ డెయిరీ నుంచి పాలను సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో దీనికి సంబంధించి సాధ్యాసాధ్యాలపై డిప్యూటీ సీఎం నేతృత్వంలో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం శనివారం సెక్రటేరియెట్ లో జరిగింది.
పశుసంవర్థక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, ఆ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి మాట్లాడుతూ.. రాష్ట్రంలో పాడి పరిశ్రమ మీద ఆధారపడి జీనం సాగిస్తున్న రైతులను ఆదుకోవడంతో పాటు విజయ డెయిరీని ఆర్థికంగా బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుంటుందని తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న పాల వినియోగం, కొత్తగా ప్రభుత్వం ప్రకటించిన మేరకు 27 లక్షల మంది విద్యార్థులకు పాలను అందించే అంశంపై డిప్యూటీ సీఎం భట్టి అధికారులతో చర్చించారు.
తెలంగాణను దేశంలోనే ‘పబ్లిక్ హెల్త్ క్యాపిటల్’గా తీర్చిదిద్దుతున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు. శనివారం ‘ఇండియా హెల్త్ సమిట్’ లో ఆయన మాట్లాడారు. ఆరోగ్యం అనేది ప్రతి ఒక్కరి ప్రాథమిక అవసరమని, ఒక కుటుంబంలో ఎవరైనా అనారోగ్యానికి గురైతే వారి జీవితకాల పొదుపు కరిగిపోయి ఆర్థికంగా కుప్పకూలిపోతారని ఆవేదన వ్యక్తం చేశారు. పేదవాడు భయం లేకుండా ఆసుపత్రిలో అడుగుపెట్టేలా తక్కువ ధరకే వైద్యం అందుబాటులో ఉండాలన్నారు. నెహ్రూ హయాంలో ఎయిమ్స్ స్థాపన, ఇందిరా గాంధీ తెచ్చిన ఐసీడీఎస్, రాజీవ్ గాంధీ ప్రవేశపెట్టిన యూనివర్సల్ ఇమ్యునైజేషన్ గ్రామీణ ఆరోగ్య ముఖచిత్రాన్ని మార్చాయని గుర్తుచేశారు.