Bhagyaraj Pet Dog: మాట రాని మూగ వేదన.. భాగ్యరాజ్ పార్థివదేహం వద్ద విలపించిన పెంపుడు కుక్క
తమిళ సినీ దిగ్గజం K. భాగ్యరాజ్ మృతితో ఆయన కుటుంబ సభ్యులతో పాటు పెంపుడు కుక్క కూడా తీవ్ర భావోద్వేగానికి గురైంది. భాగ్యరాజ్ పార్థివదేహాన్ని శవపేటికలో ఉంచగా, ఆ పెంపుడు కుక్క పదేపదే దగ్గరకు వెళ్లి బాక్సును తాకుతూ, తన యజమానిని వెతుకుతున్నట్లుగా కనిపించింది. ఆ మూగజీవి చూపించిన అనుబంధం, కళ్లలో కనిపించిన వేదన, తన అపారమైన విశ్వాసం అక్కడున్న ప్రతి ఒక్కరినీ కదిలించింది.
మనుషులు మాటలతో తమ బాధను వ్యక్తం చేయగలరు. కానీ జంతువులు తమ ప్రేమను, అనుబంధాన్ని చేతల్లో, చూపుల్లో, ప్రవర్తనలో చూపిస్తాయి. యజమానితో గడిపిన క్షణాలు, పొందిన ప్రేమను అవి ఎప్పటికీ మరిచిపోవు. అందుకే కుక్కలను విశ్వాసానికి ప్రతీకగా చెబుతారు. తమను ప్రేమించిన వ్యక్తి ఇక లేడనే విషయాన్ని అవి మాటల్లో చెప్పలేకపోయినా, వాటి కళ్లలో కనిపించే బాధ ఎంతో మందిని భావోద్వేగానికి గురిచేస్తుంది.
భాగ్యరాజ్ పెంపుడు కుక్క ప్రవర్తన కూడా అదే విషయాన్ని మరోసారి గుర్తు చేసింది. "జంతువులకు మాటలు లేకపోయినా మనసుంటుంది, ప్రేమించేవారిని కోల్పోతే అవి కూడా బాధపడతాయి" అనే కామెంట్లు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. ఈ దృశ్యం మానవులు, జంతువుల మధ్య ఉండే అనుబంధానికి నిదర్శనంగా నిలిచింది. కాగా, భాగ్యరాజ్ అంత్యక్రియలు ఇవాళ మధ్యాహ్నం 1:30 గంటలకు చెన్నైలో ప్రభుత్వ అధికారిక లాంఛనాల మధ్య నిర్వహించనున్నారు.
ఇప్పటికే, సీఎం విజయ్, రజనీకాంత్, చిరంజీవి, ఆర్.మాధవన్ తదితర ప్రముఖులు ఆయనకు నివాళులర్పించారు. స్క్రీన్ప్లే, కథ, సంభాషణలతో ప్రత్యేక ముద్ర వేసిన భాగ్యరాజ్ను సినీ ప్రపంచం 'స్క్రీన్ప్లే కింగ్'గా గౌరవించింది. దిగ్గజ దర్శకుడు భాగ్యరాజ్ భౌతికంగా దూరమైనా, ఆయన సృష్టించిన చిత్రాలు సినీ అభిమానుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయి.